నాన్న కోసం..

జూన్ 21, 2010

నాన్నంటే ఆకాశం. వెన్నెలై ప్రేమను ప్రసరించినా, ఉరుమై కోపాన్ని ప్రదర్శించినా నాన్నంటే నాన్నే…. ఎదుగుతున్న బిడ్డల వైపు నాన్న క్రీగంట చూస్తాడు. నా `తల్లీ కదా…నా తండ్రి కదా….నిన్న మొన్నటి దాకా నా గుండెలపై ఆడుకున్న పసి మొగ్గలు కదా ` అనుకుని మనసారా మురిసిపోతాడు. మన చిట్టి చేతులు పట్టుకుని నడిపించినవాడు…దారి చూపించినవాడు….మన బుజ్జి కాళ్ళతో గుండెలపై తంతుంటే తనివితీరా ముద్దాడినవాడు…. నాన్న కెన్నో కష్టాలు….తినీ తినక పైసా పైసా మన కోసమే కూడపెట్టి బిడ్డలు బాగా ఎదగాలనీ, అభివృద్ధిలోకి రావాలని కలలు కంటాడు….నడిచే దారిలో, నీడలో బిడ్డల భవిష్యత్తును కలలుగనే అమృతమూర్తి నాన్న. `ఫాదర్….డాడీ…నాన్న…తండ్రి` పేరేదైతేనేం…నాన్నొక నిర్మల నిశ్చల నిలువెత్తు చైతన్యరూపం…దీప శిఖా జ్వలితం…. ప్రేమకు మారు పేరు నాన్న….బిడ్డలను గుండెలకద్దుకుని ముద్దాడే నులివెచ్చని స్పర్శా సంగీతం…శ్రావణమేఘం…సంధ్యారాగం నాన్న. అన్నీ మనమై బతుకుతున్న వాడు…..తనకంటూ ఏమీ మిగిల్చుకోనివాడు…నిస్వార్థ జీవి నాన్న. నాన్నొక నది. జీవనది….ఎప్పటికీ ఎండిపోని సుజల స్రవంతి…. మన అడుగుల్లో అడుగై మన చుట్టూ పరిభ్రమించే కాంతి మూర్తి నాన్న… ఫాదర్స్ డే సందర్భంగా నాన్నలందరికీ బిడ్డల తరపున శుభాకాంక్షలు.

-ఫాదర్స్ డే సందర్భంగా నిన్న (ఆదివారం జూన్ 20, 2010) రాసిన ఒక ఎమోషన్ ప్రోజ్ … ఒక టీవీ చానల్ లో కూడా ప్రసారమైంది.

ప్రజారాజ్యం…ఏరు దాటి..తెప్ప తగలేసి…!

జూన్ 3, 2010

అనుకున్నదే జరిగింది. రాష్ట్రంలో కాస్త రాజకీయ అవగాహన ఉన్న వారెవరికైనా ప్రజారాజ్యం కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోతుందో తెలుసు. వారి ప్రతి కదలికలోనూ తడబాటు స్పష్టంగా కనబడుతున్నప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజారాజ్యం మద్దతివ్వదని ఎవరూ భావించలేదు. మద్దతే కాదు..రేపు ప్రభుత్వంలో చేరినా, ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనమైనా అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. పిఆర్ పి తీసుకోబోయే నిర్ణయాల పట్ల ఆశ్చర్యమైతే లేదు గానీ, ఎందరో ఆశలను చిదిమివేసిన వైనంపైనే ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చిరంజీవి అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లో, ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం రూపంలో  ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఆవిర్భవించిందని కలలు గన్న వాళ్ళకు మాత్రం `ఆ పార్టీ` ఆశనిపాతంలా మారింది.
-టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా, మెగాస్టార్ గా మూడు దశాబ్దాల పాటు వెండితెరపై మెరిసిపోయిన చిరంజీవి నటించాడు తప్ప ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు. రాజకీయల్లోనూ చిరంజీవి పాత్రధారణకు పరిమితమై కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వాన్ని ఇతరులకు అప్పగించారు. నిన్నటిదాకా బావమరిది అల్లు అరవింద్ ఆ పనిచేస్తే ఇపుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ చిరంజీవి వేలు పట్టుకుని నడిపించే పని చేస్తోంది. కాంగ్రెస్, ప్రజారాజ్యంల మధ్య భావ సారూప్యత ఉందని ప్రకటించిన చిరంజీవి `రాజ్యసభ` సీటులోనూ ఆ సారూప్యత ఉంటుందని భావించి భంగపడ్డారు. రాజ్యసభ కాదు….రాష్ట్ర మంత్రివర్గంలో చేరమంటూ కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చింది. నాలుగు మంత్రి పదవులు, రెండు ఎమ్మెల్సీలు కూడా ఇస్తామని…చిరంజీవి భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ ఆఫర్ చేస్తోంది. మరో నాయకుడు భాషలో చెప్పాలంటే ప్రజారాజ్యానికి కాంగ్రెస్ `గుడ్ విల్`  ఇస్తానంటోంది. ఆఫర్లు, గుడ్ విల్స్ పైన తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తరువాతే, తెరచాటు ఒప్పందాలు కుదిరిన తరువాతే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తామని ప్రజారాజ్యం ప్రకటించింది.
- 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యానికి 70 లక్షల ఓట్లు వచ్చాయి. 17 శాతం ఓటు బ్యాంకు పిఆర్ పి ఖాతాలో జమైంది. వీళ్ళ వల్లే ఓడామని తెలుగుదేశం గగ్గోలు పెడుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో విస్మరించటానికి వీల్లేని స్థాయిలో ప్రజారాజ్యానికి చోటు దక్కింది. మరి, ప్రజలు ప్రజారాజ్యానికిచ్చిన ప్రాధాన్యతనను ప్రజారాజ్యం ప్రజల కిస్తోందా…! కాంగ్రెస్ తో పొత్తును నీతిబాహ్యమైన చేష్టలుగా భావిస్తున్న ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఓటర్ల మనోభావాలను చిరంజీవి పరిగణలోకి తీసుకున్నారా? పొత్తు రాజకీయాలు, సంకీర్ణ ప్రభుత్వాలు దేశంలో కొత్తేమీ కాదు. అయితే, ఆ పొత్తులు దేని కోసం, ఎందుకోసం, ఎవరి ప్రయోజనాల కోసం. ఏ సందర్భంలో పెట్టుకుంటున్నారని చర్చ వచ్చినపుడు మాత్రం ఆయా పార్టీల నైతికత, విశ్వసనీయత,  ఇప్పటిదాక ఆయవల్లెవేసిన రాజకీయ నీతి చంద్రికలు జ్ఞాపకమొస్తాయి. `మార్పు` కోసం వచ్చామన్నారు. సామాజిక న్యాయమే ధ్యేయమని చెప్పారు. అవినీతి రహిత సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని ప్రకటించారు. కానీ ఇపుడేం చేస్తున్నారు? ఏ ప్రధాన పార్టీకయితే ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని స్థాపించారో, ఏ పార్టీనయితే అవినీతి కూపంగా తిట్టిపోశారో ఆ పార్టీతోనే అంటకాగేందుకూ, అవసరమైతే తన పార్టీనే అందులో విలీనం చేసేందుకు పథకం సిద్ధం చేసుకున్నారు. దేనికయినా ఆయన సిద్ధమే, కాకపోతే `ఆఫర్` మీదనే చర్చలు జరుగుతున్నాయి. ముందుగా ఆశపడ్డట్టు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినట్టయితే  బావ మరిదిని సంతృప్తి పెట్టి ఉండే వారు. మరి, మంత్రివర్గంలో చేరమంటే ఎవరిని సంతృప్తి పరచాలి? మంత్రివర్గంలో చేరటం వల్ల తమ కుటుంబానికి జరిగే లాభమేమిటి? మంత్రివర్గంలో చేరిన వాళ్లంతా చిరంజీవి కనుసన్నల్లో నడుస్తారన్న నమ్మకం ఏమిటి? ఒకసారి పొత్తు పెట్టుకున్నాక అసలు చిరంజీవి అవసరమే లేకుండా ఎమ్మెల్యేలందరినీ తమ వైపుకు తిప్పుకుంటే అప్పుడేం చేయాలి? మంత్రి పదవులు రాని వాళ్ళు చిరంజీవిపై బహిరంగ విమర్శలు చేసి మారుతున్న రాజకీయ సమీకరణల్లో జగన్ పక్షం చేరితే పరిణామాలు ఎలా ఉంటాయి? పార్టీ ఏమై పోయినా పర్వాలేదు…కాంగ్రెస్ తో పొత్తు, విలీన రాజకీయ సయ్యాటల ద్వారా  తమ కుటుంబ సభ్యులకు జరిగే ప్రయోజనమేమిటనే విషయంపైనే ఇపుడు చర్చలు జరుగుతున్నాయి. రెండు ఎమ్మెల్సీల ఆఫర్  కూడా ఉంది గనుక అల్లు అరవింద్ ను ప్రమోట్ చేసి మంత్రి వర్గంలో స్థానం కల్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏది ఏమైనా పొత్తుతోనో, విలీనంతోనో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో మమేకం కావటం  మాత్రం తధ్యం. మరి, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలేమై పోవాలి? జిల్లాల్లో పార్టీని నడిపిస్తున్న నాయకులు, మిగతా శ్రేణులు ఏం కావాలి? ఈ రాష్టంలో కాంగ్రెస్, టీడీపియేతర ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం పరితపించి ఆశాదీపంలా కనిపించిన చిరంజీవి వెంట నడిచిన వారి దారీతెన్నూ ఏమిటి? కోస్తా జిల్లాల్లో  ప్రజారాజ్యం భుజాన కాసిన చిరంజీవి సామాజికవర్గం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో ఆయనెపుడైనా ఆలోచించారా? కోస్తా జిల్లాల్లో కాపు సామాజికవర్గం సాంప్రదాయంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్. వారంతా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యానికి అండగా నిలబడ్డారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారు ఎదుర్కొంటున్న రాజకీయ అవమానాల గురించి చిరంజీవి ఏనాడైనా ఆలోచించారా? కాపులే కాదు..ప్రత్యామ్నాయ రాజకీయాలు ఆశించిన బిసిలు కూడా అధికార పార్టీ చెంతకు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. వారంతా మరింత కసితో 2014 ఎన్నికల నాటికి ప్రజారాజ్యం బలపడితే చూడాలనుకుంటున్నారు. కానీ బలపర్చే ఉద్దేశ్యం ప్రజారాజ్యం నాయకత్వానికి లేదని స్పష్టమైంది. ఒక వైపు టికెట్లు ఇచ్చినందుకు పార్టీకి డబ్బులిచ్చి మరో వైపు ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టుకుని ఆరిపోయిన వారంతా ప్రజారాజ్యం అధిపతులకు పూచికపుల్లలుగా కనపడటమే విషాదం. ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ లను ఢీకొన్న ప్రజారాజ్యం అభ్యర్థుల్లో 90 శాతం మంది కొత్త వారే. ఎన్నికల్లో వారు పెట్టిన డబ్బు రాజకీయాల్లో సంపాదించింది కాదు. వ్యాపారాలు, పరిశ్రమల్లో సంపాదించిన డబ్బునే వారు ఎన్నికల్లో ఖర్చుపెట్టారు. అనేకమంది అప్పుల పాలయ్యారు. వారికేమీ చిరంజీవి నుంచి నష్టపరిహారం అక్కర్లేదు. వారి ఆర్థిక నష్టాలకూ, బాధలకూ, అవమానాలకు స్వాంతన చేకూర్చే ఒకే ఒక అంశం…ప్రజారాజ్యం ఏ స్ఫూర్తినయితే చెప్పిందో  ఆ విలువలను కొనసాగించటం. కష్టాలనూ, నష్టాలను భరించి స్వార్థ రాహిత్యంతో, తెగువతో ప్రజారాజ్యం పార్టీని ముందుకు తీసుకెళ్లటం. ఇది చిరంజీవి చేయాల్సిన పని.  ఆయన చేయాల్సిందిల్లా నమ్ముకున్న వారికీ, ప్రజలకు నమ్మకం కలిగించేలా వ్యవహరించటమే. మరి, చిరంజీవి ఆ పని చేస్తున్నారా? వీలైనన్ని ఎక్కువ ప్రయోజనాలు పొంది వీలైనంత తొందరగా  బాక్సులు మూసేసే ఆరాటం తప్ప ప్రజారాజ్యంలో ఈషణ్మాత్రం కూడా ప్రజల దృ‍క్కోణం లేకపోవటం విచారకరం.
- చిరంజీవి చేస్తున్న మరో చారిత్రక తప్పిదమేమిటంటే….రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలను నిలువునా పాతరవేయటం. సమీప భవిష్యత్ లో ప్రత్యామ్నాయ రాజకీయాల జోలికి ఎవరూ పోకుండా `ప్రజారాజ్యాన్ని` ఒక విఫల ప్రయోగంగా చూపించటం.
వరుసగా అయిదు సినిమాలు ప్లాఫ్ అయినా ఆరో సినిమాతో హిట్ కొట్టచ్చు. రాజకీయ పార్టీ అలా కాదు. నిరంతర శ్రమతోనూ, ప్రజల సమస్యలపై నిజాయితీగా, ధైర్యంగా పోరాడే నాయకత్వ లక్షణాలతోనూ ప్లాప్ అయిన పార్టీని కూడా సూపర్ హిట్ చేయచ్చు. అందుకు కావాల్సిందల్లా ఓపిక, సహనం, ధైర్యం, త్యాగం, నిజాయితీ, విశ్వసనీయత..అన్నిటికి మించి పోరాడే మనస్తత్వం. ఇవేమీ లేని చిరంజీవి గ్లామర్ నే పెట్టుబడిగా పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నారా? సాధ్యం కాకపోయే సరికి తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ తోక పార్టీగా ప్రజారాజ్యాన్ని మిగల్చానుకుంటున్నారా? ప్రజలు గమనిస్తున్నారు….చారిత్రక తప్పిదం చేసి చరిత్ర హీనతను మూటగట్టుకునే దుర్గతి మెగాస్టార్ కు పట్టకుండా ఉంటే బాగుండు..!

తెలుగుదేశం@28

మార్చి 29, 2010

రాష్ట్ర రాజకీయ సంధ్యలో ఒక తార తళుక్కుమని నేటికి 28 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీ అనే ఆ `తార` అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికార కక్ష్యలో ఉన్నా లేకపోయినా జగజ్జేయమానంగా వెలుగొందుతూనే ఉంది. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం ప్రస్థానంపై  ప్రత్యేక కథనం.
అంబరాన్ని చుంబించిన సంబరం..రాష్ట్ర రాజకీయ యవనికపై నందమూరి అందగాడి చిరునవ్వుల వదనం…“తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా“ అనే పిలుపు..వాన కురిసినట్టు, మెరుపు మెరిసినట్టు, మేఘమై గర్జించినట్టు, సింహం జూలు విదిల్చి ప్రతిమనిషిలో పౌరుషాగ్నిని ఆవాహం చేసినట్టు..ఏదో తెలియని చైతన్య జ్వలితం మేరునగమై కనిపిస్తున్న అపురూప అద్వితీయ రాజకీయ చారిత్రక సన్నివేశం….సరిగ్గా ఈ రోజుకు 28 ఏళ్ళ క్రితం తెలుగుదేశం ఆవిర్భవించిన ఆ `దృశ్యం` ఇప్పటికీ  కళ్లముందు కదలాడుతున్న జ్ఞాపకం రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఎప్పటికీ పదిలం.
చరిత్రలో భాగం కావటం వేరు..చరిత్ర సృష్టించటం వేరు…తెలుగుదేశం చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర కథానాయకుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ బిరుదాంకితుడైన నందమూరి తారక రామారావు. సినిమాల్లో రామారావు “టేక్, యాక్షన్“ లకే పరిమితమైన హీరో కాదు. అనేక సినిమాలను నిర్మించారు. దర్శకత్వం వహించారు. రాముడిగా, కృష్ణుడిగా ప్రజల హృదయాల్లో కొలువయ్యారు. పౌరాణిక, జానపద చిత్రాలెన్నెటిలోనే నటించిన ఆయన తన సినీ జీవిత గమనంలో `మన దేశం` మొదలుకుని `నాదేశం` వరకు ఎన్నో అభ్యుదయ పాత్రలు పోషించారు. పేదలకు అండగా నిలబడి అవినీతి పరులనూ, స్వార్థపరులను చెండాడే హీరో పాత్రల్లో నటించారు. తెరపై ప్రేరణ ఏదైనా….తెర వెనుక ప్రోత్సాహం ఎవరిదైనా రాజకీయాల్లోకి రావాలన్న ధృడ సంకల్పానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజాక్షేత్రంలోకి ఉరికారు. సినీ నటునిగా రామారావుకున్న విశేషమైన అభిమానంతో పాటు ఆనాటి రాజకీయ సందర్భం కూడా తెలుగుదేశంను భుజం తట్టి ప్రోత్సహించింది. ఎమర్జన్సీ చీకటి రోజుల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన జాతీయ పార్టీలనేకం అయిదారేళ్ళకే ప్రాభవం కోల్పోయాయి. ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పడి లేచిన కెరటంలా తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా  ఆవిర్భవించిన తెలుగుదేశం రాజకీయ రూపు రేఖలను సమూలంగా మార్చేసింది. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. పట్టుదల, శ్రమ, ఆటుపోట్లు ఎన్ని ఎదురయినా మడమ తిప్పని ఎన్టీరామారావు నైజం తెలుగుదేశంను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చింది. ఆయన జనం వద్దకు వెళ్ళారు. జనం ఆయన వెంట నడుస్తూ జేజేలు పలికారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ తొమ్మిదినెలల్లో అధికార పీఠాన్ని అధిష్టించి చరిత్ర నెలకొల్పింది. రాష్ట్రంలోనే కాదు..జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ కు ప్రత్నామ్నాయ రాజకీయ శక్తుల ఆవిర్భావానికి ప్రేరణగా నిలిచింది. నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావంలో ఆయన కృషి ఎంతో ఉంది.  అనేక విజయాలు, వైఫల్యాలను చవిచూసిన తెలుగుదేశంకు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని ప్రోదిచేసిన పార్టీగా గుర్తింపు ఉంది. పార్టీ ఆవిర్భవించిన వెంటనే అధికారం దక్కించుకున్నా,  89 ఎన్నికల్లో  ఘోర పరాజయం చవిచూసినా, 94లో మళ్ళీ పాత ప్రాభవాన్ని దక్కించుకున్నా విజయాలకు పొంగిపోని, అపజయాలకు వెరవని నైజం రామారావుది. రెండు రూపాలయకు కిలో బియ్యం, మద్య నిషేధం ఆయన సాహసోపేతమైన ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు తార్కాణంగా నిలిచాయి. ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం పుట్టిన ఆ పార్టీ  ఇప్పటికీ ప్రజల్లే మమేకమై ఉండటానికి నందమూరి తారక రామారావు నిర్మించిన పటిష్టమైన పునాదులే కారణమని నమ్మేవారు తెలుగుదేశంలో అనేకమంది ఉన్నారు.
————————
సుమారు మూడు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ ప్రవాహశీలతను విశ్లేషించాల్సి వస్తే…ఎన్టీరామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం, చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం అని విభజించి పరిశీలింటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. లక్ష్మీ పార్వతిని ఎన్టీ రామారావు పెళ్ళి చేసుకోవటం, ఆ తరవాత పార్టీలో ఆమె ప్రమేయం పెరగటం…అప్పటికే పార్టీలో అధికార కేంద్రాలుగా ఉన్న ఆయన అల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకూ, నారా చంద్రబాబునాయుడికి ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాలు రామారావును పదవీ చ్యుతుడిని చేసే దాకా వెళ్లాయి. పార్టీలో రెండు భిన్న ధృవాలుగా ఉన్న తోడల్లుళ్ళు మామను గద్దె దించే విషయంలో మాత్రం ఒకటయ్యారు. ఆ తరువాత దగ్గుబాటిని పక్కకు త్రోసి తెలుగుదేశంలో చంద్రబాబునాయుడు గుత్తాధితప్యం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. తాను పుట్టించి పెంచి పెద్ద చేసిన పార్టీ తన చేతి నుంచి జారిపోవటం, ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి రావటం రామారావును తీవ్రమైన మానసిక వేదనకు గురి చేసింది. కొద్ది కాలానికే ఆయన మరణించారు. ఆ తరువాత తెలుగుదేశం పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి దేశంగా మారిపోయింది. పార్టీపై తన ముద్ర మాత్రమే ఉండేలా చంద్రబాబునాయుడు చేసిన కృషి బాగానే ఫలించింది. ఫలితంగా వెన్నుపోటు విమర్శలను ఎదుర్కొంటూ కూడా 1999 ఎన్నికల్లో పార్టీని విజయపథంలో దూసుకువెళ్ళేలా చేయగలిగి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు. “నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు ఆదేశాలు, ఆర్థిక సంస్కరణల అమలు, కంప్యూటరీకరణ, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ…“ వీటన్నిటిని మనసా వాచా నమ్మి ఆచరణలో పెట్టే సమర్ధుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు మన రాష్ట్రంలో, దేశంలో కాదు…ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్య నిషేధాలను రామారావు అమలుపరిస్తే వాటిని దశలవారీగా ఎత్తివేసిన రాజకీయ సాహసి చంద్రబాబు. ఎన్టీరామారావుకూ, చంద్రబాబునాయుడుల స్వభావంలోనూ, పాలనలో ఉన్న మౌలికమైన తేడాకు ఇంతకు మించిన విశ్లేషణ అవసరం లేదు. చంద్రబాబు పాలనలో నగరాల్లో రహదారులు విస్తరించాయి. ఫ్లై ఓవర్లు వచ్చాయి. ఐ.టి పాలపొంగులా పెల్లుబికింది. సంస్కరణల అమలుకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. చంద్రబాబుకు అంతర్జాతీయ ప్రశంసలు వచ్చాయి. పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో బాబుకు మించిన నిపుణుడు రాజకీయాల్లో లేడన్న ప్రచారం వచ్చింది. చంద్రబాబు మదిలో మెరిసిన భవిష్య ప్రణాళిక `విజన్ 2020` డాక్యుమెంట్ విడుదలైంది. కానీ, ప్రజాక్షేత్రం బాబు `విజన్` చెరిపేసింది. 2004లో బాబుకు ఓటమి మిగిలింది. ప్లై ఓవర్లు ఎన్ని నిర్మించామని కాదు…వికటాట్టహాసం చేస్తున్న కరువును ఆపేదెలా, సేద్యం చేసిన పొలాల్లో పురుగుమందు తాగి చనిపోతున్న రైతుల ఆత్మహత్యలను నివారించేదెలా, ఆకలిచావుల కేకలు లేకుండా చేసేదెలా..!? ఈ పరిష్కారాలేవీ బాబు మనసా వాచా నమ్మిన చంద్రబాబు `విజన్`లో లేకపోవటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 1989 లో ఓటమి చవిచూపిన రామారావు పట్టుదలతో ప్రజల్లోకి వెళ్ళి అధికార పక్షాన్ని ఎండగట్టి 1994లో తిరిగి అధికారంలోకి రాగలిగారు. చంద్రబాబు మాత్రం 2004లో చవిచూసిన ఓటమినే 2009లోనూ ఎదుర్కొన్నారు. ఫలితంగా ఆరేళ్ళుగా తెలుగుదేశం అధికారానికి దూరంగా ఉంది. మరో నాలుగేళ్ళు ఇలాగో ఉండబోతుంది. ఈ పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తూ చంద్రబాబునాయుడి నాయకత్వ లక్షణాలను ప్రశంసించే వారితో పాటు ఆయన వైఖరి వల్లనే పార్టీకి ఈ దుస్థితి పట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించే వారు కూడా అంతకన్నా ఎక్కువగానే ఉన్నారు.

స్టీఫెన్ హాకింగ్..విధిని జయించిన వీరుడు, ఖగోళ శాస్త్ర పరిశోధకుడు

జనవరి 7, 2010

స్టీఫెన్ హాకింగ్…మనసా వాచా కర్మణా మానవీయతకు నిలువెత్తు నిదర్శనం. చరిత్రలో పొత్తిళ్ళలో భద్రంగా దాచుకోదగిన ఆణిముత్యం. జీవన యుద్ధంలో విధిని ఓడించిన వీరుడెవరిని అడిగితే…ఈ శతాబ్దంలో `స్టీఫెన్ హాకింగే`నని చెప్పవచ్చు. స్టిపెన్ హాకింగ్ గా ప్రసిద్ధుడయిన ఆయన పేరు స్టీఫెన్ విలియం హాకింగ్. ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థ….చచ్చుపడిపోయిన కాళ్ళు…మూగబోయిన గొంతు…ఎటూ కదల్లేక చక్రాల కుర్చీలో గడిచిపోతున్న  జీవితం…ఖగోళ శాస్త్ర పరిశోధనలో చరిత్ర సృష్టించిన మహోన్నత మానవ రూపం…చైతన్య జ్వలితం. మన కళ్ళెదుటే ఈ తరానికి నిలువెత్తు చైతన్య  రూపమై, ఆదర్శమై కనిపిస్తున్న తేజోరూపం స్టీఫెన్ హాకింగ్.  సరిగ్గా ఇదే రోజు 1942 జనవరి 8న  ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ ఆయన జన్మించారు. ఆయన తండ్రి లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో  స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని  సురక్షిత ప్రాంతానికి పంపించారు. అక్కడే స్టీఫెన్ జన్మించారు. భౌతిక శాస్త్రం డిగ్రీ అందుకున్న స్టీఫెన్ 1962లో కాస్మాలజి, జనరల్  రిలేటివిటీ పరిశోధనల కోసం ఆక్స్ ఫర్ద్ కి వెళ్ళారు. త్వరలోనే పి.హెచ్.డి అందుకోవాల్సిన సమయంలో స్టీఫెన్ ను తీవ్రమైన వ్యాధి  వెంటాడింది. స్టీఫెన్ శరీరం ఏ పనికీ సహకరించలేదు.  పరీక్షలు చేసిన వైద్య నిపుణులు స్టీఫెన్ కు  భయంకరమైన `మోటార్  న్యూరాన్ వ్యాధి` సోకినట్టు నిర్ధారించారు. నరాలు, వెన్నపూసపై ప్రభావం చూపించే ఈ వ్యాధిని `ఆర్మీట్రోఫిక్ లేటరల్ స్కిలోరోసిస్` అని  కూడా అంటారు. డాక్టరేట్ కూడా అందుకోకుండానే స్టీఫెన్ మరణించవచ్చని అందరూ భావించారు. అయితే, విధిని ఎదిరించారు.  మొక్కవోని దీక్షతో, పట్టుదలతో పిహెచ్ డి పూర్తి చేయటమే కాక ఖగోళ శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి ప్రపంచానికి  అందించారు. ఆయన `కృష్ణ బిలాలు`పై పరిశోధన చేసి అనేక ఫలితాలను రాబట్టారు.  `హాకింగ్స్ రేడియేషన్` గా పిలుస్తున్న కృష్ణ  బిలాల రేడియేషన్ సిద్ధాంత కర్తగా స్టీఫెన్ హాకింగ్ ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించారు. 1970 నుంచి ఆయన కృష్ణ బిలాలపై  పరిశోధనలు చేశారు. జనరల్ రిలేటివిటి, క్వాంటమ్ థియరీ ఆధారంగా కృష్ణ బిలాలు కూడా `ధార్మిక శక్తి`ని కలిగి ఉంటాయని తన  పరిశోధనల ద్వారా తెలియచెప్పారు. 1971 నుంచి `బిగ్ బ్యాంగ్`పై పరిశోధనలు ప్రారంభించిన ఆయన `కృష్ణ బిలాల`కు  సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో “ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్“ పుస్తకరచన ప్రారంభించారు. ఆ  సమయంలో ఆయన కంప్యూటర్ సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని తయారు చేసుకున్నారు. దాని సాయంతోనే  `ఏ బ్రీఫ్ హిస్టరీ  ఆఫ్ టైమ్“ రచనను పూర్తి చేసి 1988లో ఆ పుస్తకాన్ని మార్కెట్ లోకి విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో విడుదలైన ఆ  పుస్తకం అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. `కాలం కథ` పేరుతో తెలుగులో కూడా ఆ పుస్తకం విడుదలైంది. పదేళ్ళ తరువాత 1998 లో  ఆ పుస్తకం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. 1975 నుంచి 2006 వరకు ఆయన ప్రపంచ వ్యాప్తంగా అనేక  ప్రఖ్యాత అవార్డులు అందుకున్నారు. 1975లో ఎడింటంగ్ అవార్డు అందుకున్న ఆయన ఆ తరువాత రాయల్ సొసైటీ హ్యుస్ మెడల్,  ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మెడల్, కంపానియన్ ఆఫ్ ఆనర్, రాయల్ సొసైటీ కాప్లీ వంటి అనేక ప్రసిద్ధ అవార్డులను అందుకున్నారు. కేంబ్రిడ్జి  విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందించిన స్టీఫెన్ హాకింగ్ గత ఏడాది పదవీ విరమణ చేశారు.

తెలంగాణ బతుకు `చిత్రం`…పి.టి రెడ్డి

జనవరి 4, 2010

చిత్రకళా శిల్పం..కుంచె గీసిన జీవన చిత్రం…పాకాల తిరుమలరెడ్డి జయంతి ఈ రోజు. ప్రజల కష్టాలకూ, కన్నీళ్ళకూ, కేరింతలకు అద్దం పడుతూ జీవన సౌందర్యాన్నీ, విధ్వంస `చిత్రాన్ని` ఆవిష్కరించిన ఆయన కరీంనగర్ జిల్లా అన్నవరం గ్రామంలో 1915 జనవరి 4న జన్మించారు. పి.టి రెడ్డిగా అందరికీ పరిచయమైన ఆయన చిత్రకళా రంగానికి ఆరు దశాబ్దాల పాటు విశేష సేవలందించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. బొంబాయిలోని సర్ జె.జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీ నుంచి 1942లో చిత్రకళలో ఆయన డిప్లొమా చేశారు. చిత్రకళను కేవలం అకడమిక్ జ్ణానానికే పరిమితం చేయకుండా సమాజాన్ని నిరంతరం అధ్యయనం చేయటం ద్వారా అనేక అద్భుత చిత్రాలను అందించారు. మన దేశంలోని అన్ని ముఖ్య నగరాలతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్, జర్మనీ తదితర దేశల్లో కూడా ఆయన చిత్రకళాప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ పోరాటం ఉధృతమవుతున్న ఈ సమయంలో పి.టి రెడ్డిని జ్ఫాపకం చేసుకోవటం చారిత్రక అవసరం. పి.టి రెడ్డి కుంచె తెలంగాణ జీవన చిత్రాన్ని ఉన్నదున్నట్టుగా ఆవిష్కరించింది. తెలంగాణ ప్రజల ఆర్తినీ, ఆకాంక్షనీ, ఆకలినీ, ఆవేదనను పి.టి రెడ్డి తన `చిత్రాల` ద్వారా ప్రపంచానికి చూపించారు. బక్క చిక్కిన తెలంగాణ రైతు, తెలంగాణ పల్లెల్లో జీవన ఘర్షణ, తెలంగాణ పల్లెల్లోని మహిళల ఆవేదన, తెలంగాణ పోరాటం..ఇలా తెలంగాణ ఆత్మఘోషను వినిపించే అనేక చిత్రాలను ఆయన కుంచె ఆవిష్కరించింది. ఈ `రంగుల శిల్పి` ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లోని పరిణామాలనూ, మార్మిక, తాంత్రిక, శృంగార భావనలను తన చిత్రాల్లో పలికించారు. ప్రముఖ రచయిత్రి పి.యశోదారెడ్డి ఆయన భార్య. 1996 అక్టోబర్ 21 న పి.టి రెడ్డి భౌతికంగా మన నుంచి దూరమయ్యారు.

తెలంగాణా తల్వార్ ఆళ్వార్

నవంబరు 21, 2009

వట్టికోట ఆళ్వారుస్వామి అతని కలం వజ్రాయుధం…అతనిది న్యాయపథం….అబద్ధాసురుని పాలిట తల్వార్ ఆళ్వార్….ఆనంద రమణికి షల్వార్ ఆళ్వార్….ఇవి దాశరధి రాసిన అగ్నిధార కవితా సంకలనంలో ఆళ్వారుకు అనే కవితలోని పంక్తులు. కవిత రాయటమే కాదు…తెలంగాణా ప్రజాసాహిత్యానికీ, ఉద్యమానికి ఊపిరిపోసిన యోధుడు వట్టికోట ఆళ్వారుస్వామికి దాశరధి తన అగ్నిధారను అంకితం చేశారు. 1915 నవంబరు ఒకటిన నల్లొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని మాచవరం గ్రామంలో ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించటంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండి పెడుతూ విద్యాభ్యాసం చేశారు. రచయితగా, కమ్యూనిస్టు నేతగా, పాత్రికేయుడిగా బహుముఖ పాత్రలు పోషించిన ఆళ్వారు తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేశారు. చేశారు. తెలంగాణ ప్రజల జీవన నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ 1952లో ఆయన రాసిన ప్రజలమనిషి అనే నవల సంచలనం రేకెత్తించింది. నల్గొండ జిల్లాలో నిజాం వ్యతిరేక ఉద్యమ నిర్మాణంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఆంధ్ర మహా సభ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా నిజాంకు వ్యతిరేకంగా ఆయన ప్రజా చైతన్యాన్ని ప్రోది చేశారు. ఈ క్రమంలో అనేక సార్లు జైలుకు కూడా వెళ్ళారు. జైలులో ఉండగా ఆయన అనేక కథలు రాశారు. జైలు లోపల అనే పేరుతో కథల సంపుటిని కూడా ప్రచురించారు. ఆ రోజుల్లోనే తెలంగాణా ప్రజల చైతన్యాన్ని ఆకాంక్షిస్తూ….దేశోద్ధారక గ్రంథమాలను ఏర్పాటుచేశారు. 1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రణతో గంగు అనే నవలను కూడా రాశారు. ఇలా..తెలంగాణా సాహిత్యోద్యమంలోనూ, పోరాటాల్లోనూ కీలకపాత్ర పోషించిన ఆయన 1961 ఫిబ్రవరి అయిదవ తేదీన కన్నుమూశారు.

మైసూరు పులి..బ్రిటీష్ వెనుచలి `టిప్పుసుల్తాన్`

నవంబరు 19, 2009

మైసూర్ పులి, బ్రిటీష్ పాలకుల వెనుచలి..టిప్పు సుల్తాన్ జయంతి ఈ రోజు.
కర్ణాటక రాష్టం కోలార్ జిల్లా దేవనహల్లిలో 1750, నవంబర్ 20న ఆయన జన్మించారు. అతని తండ్రి హైదర్ అలీ మైసూర్ రాజు. అతని తల్లి ఫాతిమా కడప కోట గవర్నరు మొయినుద్దీన్ కుమార్తె.  మైసూర్ సంస్థానాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తున్న నేతగా అప్పటికే టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీకి మంచి పేరుంది. ఫ్రెంచి పాలకుల కోరిక మేరకు మైసూర్ లో మొట్టమొదటి చర్చి నిర్మించిన ఆయన బ్రిటీష్ పాలకుల పెత్తనంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 1782లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రి హైదర్ అలీకి టిప్పు సుల్తాన్ వెన్నుదన్నుగా నిలిచి బ్రిటీష్ సైన్యాన్ని తరిమికొట్టారు. అదే సంవత్సరం హైదర్ అలీ మరణించటంలో మైసూర్ సంస్థానాధీశుడిగా టిప్పు సుల్తాన్ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఫ్రెంచి అధికారుల వద్ద టిప్పు సుల్తాన్ యుద్ధ విద్యలు అభ్యసించారు. 1766లో పదిహేనేళ్ళ వయసులోనే తండ్రితో కలిసి మొదటి మైసూరు యుద్ధంలో పాల్గొన్నారు. 16 ఏళ్ళ ప్రాయంలోనే అశ్వక దళాలకు సారధ్యం వహించారు. 1775-1779 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో పాల్గొని తన వీరత్వాన్ని ప్రదర్శించారు. భారతదేశంలోని అనేక సంస్థానాలు బ్రిటీష్ ప్రభువుల కనుసన్నల్లో పాలన సాగించినా టిప్పు సుల్తాన్ మాత్రం ధీరోధాత్తుడై వారితో పోరాడారు. సామాన్య ప్రజలతో గొంతు కలిపి స్వతంత్ర్యం మా జన్మహక్కని పోరాటం చేశారు. బ్రిటీష్ పాలకులు మైసూరును కైవసం చేసుకోవాలని ఎన్నో కుయుక్తులు పన్నారు. బ్రిటీష్ సైన్యం దండెత్తి వచ్చినప్పుడల్లా టిప్పు సల్తాన్ వారిని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. 1792లో జరిగిన యుద్ధంలో లోహపు కవచాలు ఉన్న రాకెట్ లను వదిలి బ్రిటీష్ సైన్నాన్ని  గడగడ లాడించారు. ఆ తరహా రాకెట్లను ఆ తరువాత బ్రిటీష్ సైన్యం కూడా తయారుచేసి ప్రయోగించింది. మైసూరు సార్వభౌమాధికారం బ్రిటీష్ పరం కాకుండా జీవిత పర్యంతం వీరోచింగా పోరాడిన టిప్పు సల్తాన్ 1799లో శ్రీ రంగపట్నంలో జరిగిన యుద్ధంలో మరణించారు. టిప్పు సుల్తాన్ ఒకసారి ట్రావన్ కోర్ నాయర్లతో యుద్ధం చేస్తున్న సందర్భంగా తన ఖడ్గాన్ని పోగొట్టుకున్నారు. ఆ ఖడ్గాన్ని ఆర్కాట్ నవాబుకు ట్రావన్‌కోర్ రాజు బహుమతిగా ఇచ్చారు. ఆ తరువాత ఆ ఖడ్గం లండన్ కు చేరింది. 2004లో జరిగిన వేలంలో భారతీయ వ్యాపారవేత్త విజయ్ మాల్య దానిని కొని దాదాపు రెండు శతాబ్ధాల తరువాత మన దేశానికి తీసుకువచ్చారు.

-టిప్పుసుల్తాన్ జయంతి…నవంబర్ 20, 1750

రెక్క తెగిన పక్షి పాట..పికాసో

నవంబరు 17, 2009

పికాసో చిత్రమా…ఎల్లోరా శిల్పమా…! ఈ పాట ఎక్కడో విన్నట్టుంది కదూ..! ప్రేమికుల ఊహా చిత్రం, ప్రాకృతిక సౌందర్యం, జీవన మాధుర్యం..మనిషి అంతరంగంలో రగిలే అగ్నిగుండం, ఎగిసిపడే కల్లోల కెరటం, కన్నీటి తరంగం, విధ్వంస వ్యూహం…ప్రపంచ రక్త చరిత్రలో తడిసి ముద్దయిన మానవ దేహం….20 వ శతాబ్ధంలో అన్నిటినీ ఒకే చోట బంధించి మానవాళికి కానుకగా సమర్పించిన అపురూప చిత్రకారుడు పాబ్లో పికాసో పుట్టిన రోజు నేడు.
20వ శతాబ్దపు చిత్రకళా విశ్వంభర ఉత్సవమూర్తి గా ఘన కీర్తి సాధించిన పికాసో 1881, అక్టోబరు 25న స్పెయిన్ లో జన్మించారు. చిత్ర కళను తండ్రి నుంచి వారసత్వంగా అభ్యసించారు. చిన్నతనంలోనే అబ్బురమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.  శాన్ ఫెర్నాండో రాయల్ అకాడమీలో చిత్ర కళలో శిక్షణ పొందిన పికాసో 1895లో చెల్లెలి మరణంతో పసి ప్రాయంలోనే అంతర్వేదనకు గురయ్యారు. మనిషి వేదనను శోధించే పనిలో తనలోని భావాలన్నిటికీ చిత్రరూపం ఇచ్చారు. ప్రకృతి-మానవ సంబంధాల అంతర్ముఖాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన పికాసో కుంచె చిత్రకళలో ఎన్నో అద్భుతాలకు ప్రాణం పోసింది. చిత్రలేఖనంలో క్యూబిజంను ప్రవేశపెట్టి ఆధునిక చిత్రకళా ఆద్యుడిగా కూడా పికాసో ఘనకీర్తిని సాధించారు. అవిగ్ నాన్ వంటి తైలవర్ణ చిత్రాల రూపకర్త కూడా ఆయనే. చరిత్ర చీకటి కోణంలో దాగిన అట్టడుగున దాగిన కథలనూ, బాధా సర్పర ద్రష్టుల బాధలను పికాసో చిత్రాలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. 1937లో జర్మనీ, దాని మిత్రపక్ష దేశాలు గుయెర్నికా రాజధాని బాస్క్ ను బాంబుదాడులతో నేలమట్టం చేశాయి. దీనికి స్పందించి పికాసో గీసిన అపూరూప చిత్రం గుయెర్నికా .. ప్రపంచంలో బలవంతుల దౌర్జన్యాలకూ, నెత్తుటి గాయాలకూ సజీవరూపంగా నిలిచిపోయింది..అపురూప కళాఖండంగా పేరు పొందింది. 1962లో అంతర్జాతీయ లెనిన్ శాంతి బహుమతిని పికాసో అందుకున్నారు. 1973 ఏప్రిల్ 8న 91 ఏళ్ళ వయసులో పికాసో తుది శ్వాస విడిచారు. 2006 మే 4న పికాసో చిత్తరువు తొమ్మిదన్నర కోట్లకు అమ్ముడుపోయింది. అయితే, అంతకంటే విలువైన , వెలకట్టలేని చిత్రాలను ఆయన మానవాళికి అందించి వెళ్ళారు.

జార్ఖండ్ హీరో బొర్సా ముండా

నవంబరు 16, 2009

జార్ఖండ్ అల్లూరి…స్వాతంత్ర్య వీరుడు..స్వరాజ్య బాలుడు…బిర్సా ముండా జయంతి ఈ రోజు. 1875 నవంబర్ 15న అపుడు బీహార్ లో భాగంగా ఉన్న జార్ఖండ్ లో ముండా తెగకు చెందిన ఆదివాసీ కుటుంబంలో ఆయన జన్మించారు. బ్రిటీష్ పాలకుల ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న అడవి తల్లి శోకాన్ని చూసి బిర్సా ముండా చలించిపోయారు. గిరిజన తండాలను ఏకం చేశారు. మన్యంలోని సాంప్రదాయక ఆయుధాలతో బ్రిటీష్ పాలకులను తమ ప్రాంతం నుంచి తరిమికొట్టేందుకు ఉద్యమించాడు. బ్రిటీష్ దొరలపై బిర్సా ముండా చేసిన యుద్ధం ఆ రోజుల్లో దేశంలోని మన్యం పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. అనేకమంది ముండాను ఆదర్శంగా చేసుకుని అటవీ ప్రాంతాల్లో బ్రిటీష్ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడారు. భారత స్వతంత్ర్య పోరాట చరిత్రలో రియల్ హీరోగా పేరొందిన బిర్సా ముండా నూనుగు మీసాల ప్రాయంలో…25 ఏళ్ళ వయసులోనే అమరుడయ్యారు. ముండారు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసిన బ్రిటీష్ పోలీసులు అతన్ని రాంచి జైలులో ఉంచారు. ఆ జైలులోనే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివాసుల అస్తిత్వం, తిరుగుబాటు చరిత్ర పటంలో చేతనా పతాకమై ఎగురుతున్న బిర్సా ముండా…నీకు వందనాలు.

-బిర్సా ముండా జయంతి ఈ రోజు…నవంబర్ 15, 1875

Follow

Get every new post delivered to your Inbox.